
రాఖీ పండుగ అనగానే ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు మారుపేరు. తమ్ముడి చేతికి అక్క, అన్నయ్యకు.. చెల్లి రాఖీ కట్టి సోదరి ప్రేమను గుర్తు గుర్తు చేసుకుంటారు. సూర్యాపేట పట్టణ వీధుల్లో ఆటో మొత్తం రాఖీలతో అందంగా అలంకరించి.. వీధుల్లో తిరుగుతూ.. అన్నాచెల్లెళ్లను, అక్కాతమ్ముళ్లను రాఖీ పండుగకు సిద్ధం చేసింది. రాఖీలతో రోడ్డెక్కిన ఆప్యాయతల బండి..చుట్టూ రాఖీలే.. ఎటు చూసినా రంగురంగుల రాఖీలే. రాఖీలతో అలంకరించిన ఆటోను చూస్తే.. వాహనం కనిపించదు. ఈ ఆటో ఎక్కడ కనిపించినా.. జనం.. ఒక్కసారి ఆగి చూస్తున్నారు. ఆటోలో వేలాడుతున్న ప్రతి రాఖీని చూస్తే.. ఓ సోదరి ప్రేమ కనిపిస్తుంది.. ఓ సోదరుడి భరోసా కనిపిస్తుంది. ఇంటి ముందుకు వచ్చిన ప్రేమాభిమానాలు ఆప్యాయతలను కలబోసిన రాఖీలను సోదరీమణులు కొనుగోలు చేస్తున్నారు.ఇలా బంధాలను గుర్తు చేస్తూ.. రాఖీ పండుగ సందేశాన్ని గడప గడపకూ తీసుకెళ్తోంది ఆటోలో కనిపిస్తున్నది రాఖీ కాదు.. బంధం మాత్రమే. ఇది పొట్టకూటి కోసం నడిచే ఆటో కాదు.. బంధాల్ని బతికించేందుకు కదులుతున్న ఆటో.
పొట్టకూటి కోసం ఆటో నడుపుతూనే.. అన్నాచెల్లెళ్ల మధ్య దూరాన్ని తగ్గించడం.. అక్కాతమ్ముళ్ల మధ్య ఆప్యాయతను పెంచడం ద్వారా రాఖీ పండుగ అసలు స్ఫూర్తిని గుర్తు చేయడం ఆనందంగా ఉందని ఆటో యజమాని శంకర్ చెబుతున్నాడు. కాలం మారుతుంది.. జీవన విధానం మారుతుంది.. ఉరుకులు పరుగుల జీవితంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి.
ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకునే సమయం లేని పరిస్థితి.. పక్కపక్కనే ఉన్నా పలకరించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బంధాలను మర్చిపోవద్దు.. రక్త సంబంధాలను కాపాడుకోండి..” అంటూ నిశబ్దంగా సందేశం ఇస్తోంది ఈ రాఖీ ఆటో.