
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు చలి వణుకు పుట్టించిన వాతావరణం మెల్లగా వెచ్చదనం అలుముకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో అప్పుడప్పుడు చలి పలకరించినా.. రోజు మొత్తంలో బాణుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. పైగా గత కొన్ని రోజులుగా సాధారణం కంటే ఎండలు కాస్త చురుకు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒంటి పూట బడులకు సంబంధించిన ప్రకటన వెలువరించింది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో మార్చి 16 నుంచి పాఠశాలల టైమింగ్స్ కూడా మారనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడి పని వేళలు మారనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ క్రమంలో వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు రానున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి గానూ స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముందే ప్రకటించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
మరోవైపు ఈ రోజు నుంచి రంజాన్ మాసం నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలల్లో ప్రత్యేక మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అవసరమైతే వారంలో ఒక రోజు అదనపు తరగతులు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఉపవాసంలో ఉన్న విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ మార్పులు అమలు చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.