కాళేశ్వరం నివేదిక.. హైకోర్టుకు వెళ్లిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌!

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు జారీ చేసిన విధానం, వాంగ్మూలం నమోదును ప్రశ్నిస్తూ, నివేదికను కొట్టివేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తనపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం నివేదిక.. హైకోర్టుకు వెళ్లిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌!
Smitha Sabarwal

Updated on: Sep 24, 2025 | 8:57 AM

కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించిన విషయం తెలిసిందే. కమిషన్‌ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సభర్వాల్‌ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఆమె పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా.. పరిశీలన పూర్తయి లిస్ట్‌ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి