తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కానీ ఆ ఉప ఎన్నిక కారణంగా తెరమీదకి వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ఇంకా తెమలలేదు. ఈ కేసులో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాష్ట్ర, కేంద్ర అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ పెట్టిన ఈ కేసులో అనేక పరిణామాలు కలగజేసుకునే వాతావరణం కనిపిస్తోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురు కీలక వ్యక్తులు సోమవారం విచారణకు హాజరు కావాలని సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సంతోష్, కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ విచారణకు రావాల్సి ఉంటుంది. ఇవి సీఆర్పీసీ 41ఏ నోటీసులు కావడంతో ఆ నలుగురు వ్యక్తిగతంగానే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరి వాంగ్మూలాల నమోదే.. తదుపరి దర్యాప్తులో కీలకం కాబోతుంది. విచారణలో కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయా..? రావా..? ఆనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్నలు. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప నలుగురూ కచ్చితంగా సిట్ విచారణకు సోమవారమే హాజరు కావాలి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, భాజపా ప్రధాననేత అయిన బీఎల్ సంతోష్ విచారణకు రావాల్సి ఉండటం రాజకీయ వాతావారణాన్ని వేడెక్కించే అంశం. ఆ నలుగురూ చట్టపరమైన రక్షణ అవకాశాలను, న్యాయపరమైన సాంకేతికాంశాలను వినియోగించుకోవచ్చని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. నిందితులు విచారణకు సహకరించాలని.. పోలీసులు వారిని అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే నిర్దేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 29 లోపు కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున కీలక ఆధారాలు సేకరించే పనిలో సిట్ మునిగిపోయింది.
ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్రెడ్డిని భాజపాలో చేరాలంటూ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అక్టోబర్ 26న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సిట్ విచారించిన క్రమంలో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. దాని ఆధారంగానే నలుగురికీ నోటీసులు జారీ చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయానికి సోమవారం వీరిని విచారణకు పిలవడంతో.. వారిని ఏయే ప్రశ్నలను అడగాలనే దానిపై పలు ప్రశ్నలను సిట్ ఈ పాటికే తయారుచేసుకుంది. నలుగురినీ వ్యక్తిగతంగా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధంగా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..