
Telangana Dharani: ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వెలుగుచూసిన భూ యాజమాన్య మార్పులు, ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు, సాంకేతిక లోపాల దుర్వినియోగం వంటి అంశాలపై మరింత లోతైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సిట్లో రెవెన్యూ, పోలీస్, సైబర్ క్రైమ్, ఐటీ శాఖలకు చెందిన అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా జరిగిన మార్పులను గుర్తించడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్ను వెలికితీయడమే ఈ బృందం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను సిట్ పరిశీలించనుంది. మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పులు, నిషేధిత జాబితాలోని భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన మార్పులపై ప్రత్యేక దృష్టి సారించనుంది. సిట్కు సంబంధించిన మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల భూముల హక్కులు అనుమానాస్పదంగా మారినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా అక్రమంగా బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అక్రమాల లింకులు ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లు, దళారులు, మరికొందరు కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల దారిమళ్లింపు వ్యవహారం వెలుగుచూడగా, సుమారు 4,100 లావాదేవీలను అధికారులు అనుమానాస్పదంగా గుర్తించారు. కొన్ని జిల్లాల్లో భూముల హక్కులు గుట్టుగా మారిన కేసులు కూడా విచారణలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న అనుమానితుల నుంచి కీలక సమాచారం లభించడంతో, అక్రమాల వెనుక ఉన్న నెట్వర్క్పై అధికారులు మరింత దృష్టి పెట్టారు.
ధరణి అక్రమాలపై ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికారులు సమర్పించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి తహసీల్దార్ సుజాతను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భూముల పోర్టల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 56 దస్త్రాలను ఆమోదించడం, అసైన్డ్ భూముల వారసత్వ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో సుమారు 448 ఎకరాల భూముల హక్కుల్లో మార్పులు జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సిట్ ఏర్పాటు అనంతరం ధరణి పోర్టల్కు సంబంధించిన గత కొన్నేళ్ల భూ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి