
మేడ్చల్, మే 27: శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించడం జిల్లాలో సంచలనంగా మారింది. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.దాడుల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..
శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్ వ్యవహారంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.ప్రాథమిక విచారణలో ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు తేలిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎమ్మార్వో సుచరితతో పాటు కీసర ఆర్డీఓ రాజేష్ సహా పలువురు సిబ్బందిని అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఇదే శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం 2024లో కూడా లంచం ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఎమ్మార్వో సత్యనారాయణ తన డ్రైవర్తో కలిసి రూ.2 లక్షల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడంతో జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.