
రాష్ట్రంలోని రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. రైతన్నలకు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయనున్నారు. అలాగే సన్న వడ్ల తరహాలో నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర పంటలకు కూడా బోనస్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇక రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని సుమారు కోటి యాబైలక్షల ఎకరాల వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.9 వేల కోట్లను సిద్ధం చేసింది. అయితే మూడు విడతల్లో ఈ మొత్తం రూ.9వేల కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతగా ఆదివారం సాయంత్రం ఎకరం వరకు భూమి ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులు ఖాతాల్లో రూ 3,590 కోట్లు జమ కానున్నాయి. అయితే ఇవాళ ఆదివారం కావడంతో సోమవారం రోజూ ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
ఈ తొలి విడత నిధులు ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు బ్యాంకుల నుంచి నేరుగా రైతన్నల అకౌంట్లలో జమ అవుతాయి. ఇక మరో 20 రోజుల తర్వాత రెండో విడతలో భాగంగా రూ.2,650 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక ఏప్రిల్ చివరి నాటికి చివరి విడతల నిధులకు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మూడో విడతలో భాగంగా రూ.2,760 కోట్లు విడుదల కానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.