Revanth Reddy: తెలంగాణ సీఎంగా మాస్ లీడర్.. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఎలా సాగిందో తెలుసా..?
తెలంగాణ రాజకీయాల్లోనే.. కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న.. పేరు రేవంత్ రెడ్డి.. గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పడం ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం. తొలి అడుగు నుంచి టీపీసీసీ చీఫ్గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే స్థాయి వరకు రేవంత్ నడిచిన దారి రహదారి కాదు.. ముళ్లదారి. ప్రతి అడుగులో అడ్డంకులు.. ప్రతి చర్యలో విమర్శలు.. ప్రతి నిర్ణయంలో వివాదాలు.. ఇలా ఆయన ముఖ్యమంత్రి సీటు వరకు వెళ్లారు..
తెలంగాణ రాజకీయాల్లోనే.. కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న.. పేరు రేవంత్ రెడ్డి.. గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పడం ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం. తొలి అడుగు నుంచి టీపీసీసీ చీఫ్గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే స్థాయి వరకు రేవంత్ నడిచిన దారి రహదారి కాదు.. ముళ్లదారి. ప్రతి అడుగులో అడ్డంకులు.. ప్రతి చర్యలో విమర్శలు.. ప్రతి నిర్ణయంలో వివాదాలు.. ఇలా ఆయన ముఖ్యమంత్రి సీటు వరకు వెళ్లారు.. సింహాసనాన్ని అధిరోహించనున్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎల్పీ నేతగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం.. ఎలా సాగిందో ఒకసారి చూడండి..
రేవంత్ రెడ్డిది సిల్వర్ స్పూన్ రాజకీయం కాదు. కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ.. అందులో అనుభవం సంపాదిస్తూ.. తనకంటూ ఓప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుని మాస్లీడర్గా ఎదిగి తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. జడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రయాణం…వైఎస్ఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్ధిగా గెలుపొందడంతో రేవంత్రెడ్డి అన్నపేరు రాజకీయానికి పరిచయమైంది. వైఎస్ఆర్ లాంటి ఆకాశమంత డైనమిక్ లీడర్ను ఢీకొని.. ఇండిపెండెంట్గా నిలబడి గెలవడంతో 2007లో రేవంత్ పేరు మార్మోగింది.
ఇండిపెండెంట్గా మొదలైన రేవంత్ పొలిటికల్ అడుగులు..టీడీపీలో అడుగుపెట్టాక ఆయన రాజకీయం పరుగు అందుకుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. అక్కడ్నుంచి కొండగల్ కోడెగిత్త.. అనిపిలుపించుకునే స్థాయికి రేవంత్ ఇమేజ్ పెరగసాగింది. ఇలా టీడీపీలో మెట్టు మెట్టూ ఎదుగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా..నమ్మినబంటుగా మారి..పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించేవారు. 2014నుంచి రేవంత్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. రాష్ట్రవిభజన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా.. తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోసాగింది. అలాగే ఒక్కో మరక రేవంత్ రాజకీయ జీవితంపై పడసాగింది. 2009-2014 అసెంబ్లీ ఎన్నికలలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల కారణంగా రేవంత్ రెడ్డి తొలిసారి అవినీతి మరక పడింది. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.3.6 కోట్లు గానూ, రూ.73 లక్షలు వరకు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. ఐదేళ్ల తర్వాత అంటే 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.13.12 కోట్లు గానూ, అప్పులు రూ.3.3 కోట్ల వరకు ఉన్నట్లు చూపారు. అంటే కేవలం అయిదేళ్లలోనే ఆయన ఆస్తులు 4 రెట్ల వరకు పెరిగాయన్న మాట. దానిపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సందర్భంలోనే ఓటుకు నోటు అంశం రేవంత్ పొలిటికల్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలింది.
2015తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఓ స్టింగ్-ఆపరేషన్ వీడియో బయటికొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ 2015 మేలో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసింది. దాదాపు నెలరోజుల పాటు జైల్లో ఉండాల్సివచ్చింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు. ఇది కూడా రేవంత్రెడ్డి పాపులారిటీని పెంచేలా చేసిందంటారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ను గద్దె దింపడమే తన లక్ష్యం అంటూ చర్లపల్లి జైలునుంచి బయటకు వచ్చిన క్షణంలో రేవంత్ చేసిన సవాల్ ఇది. ఆలక్ష్యం కోసమే రేవంత్రెడ్డి ఇష్టంలేకపోయినా కొందర్ని కలుపుకున్నారని..కొందరితో గొడవపడ్డారని…సొంతపార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్చకున్నారని…అమ్ముడుపోయిన రేవంత్రెడ్డి అంటూ ప్రత్యర్ధులు తిట్టిపోసినా పంటిబిగువున భరించాడని..ఆయన అభిమానులు తరచూ చెప్పేమాట
ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయం కొండెక్కిందని..ఇక కొండగల్కే పరిమితమని హేళన చేసినోళ్ల నోళ్లకు తాళం వేసేలా రేవంత్రెడ్డి ఎదిగిన తీరు ప్రశంసనీయమంటారు రాజకీయ విశ్లేషకులు. ఓటుకు నోటు కేసు తర్వాత బెయిల్నుంచి విడుదలయ్యాక టీడీపీలో మునుపటి జోరు తగ్గింది. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా అధికారపార్టీలోకి జారుకోవడంతో పార్టీ మరింత బలహీనపడింది. దీంతో టీడీపీలో ఉంటే తన టార్గెట్ రీచ్ కాలేమని భావించిన రేవంత్రెడ్డి 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చంద్రబాబు సలహాతోనే కాంగ్రెస్లో చేరారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. రేవంత్రెడ్డి కాంగ్రెస్లో అయితే చేరారు కానీ..అక్కడి గ్రూపు రాజకీయాలు తట్టుకుని నిలబడం అంతతేలికైన వ్యవహారం కాదని త్వరగానే తెలుసుకున్నారు. సొంతపార్టీ నేతలు చీత్కారాలమధ్యే తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్పై నమ్మకంతో 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇచ్చింది. అయితే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అక్కడ రేవంత్ దూకుడుకు కాస్త బ్రేకు పడినట్లైంది. పార్టీలోనూ ఆయనపై మరింత అసంతృప్త జ్వాల రగలడానికి కారణమైంది. అయినా వెనక్కి తగ్గలేదు. ఏం జరిగినా..ఎలా జరిగినా తన మంచికే అనుకుంటూ ముందుకువెళ్లారు..
2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ గెలుపు హైకమాండ్కు రేవంత్రెడ్డిని మరింత దగ్గర చేసింది. అక్కడ నుంచి రేవంత్రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీలో మరో లెవల్కు వెళ్లింది. ఎదిగేలా చేసింది. చివరకు సీఎం అయ్యేలా చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..