
మొన్న హైదరాబాద్లో హల్చల్.. నిన్న తిరుమల కొండపై ప్రత్యక్షం.. ఇవాళ ఏంటి? ఉన్న ఐదుగురు అసంతృప్త ఎమ్మెల్యేలకు మరొకరు అదనం. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మేడ్చల్ ఎమ్మెల్యేల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. నేరుగా ఎమ్మెల్యేలను కలుస్తానన్న మల్లారెడ్డి వారిని ఎప్పుడు కలుస్తారు? ఈ చిచ్చు ఎప్పుడు చల్లారుతుంది? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారిన అంశం ఇదే. అవును, ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ ఒక రకంగా రాజకీయ ప్రకంపనలే సృష్టించింది.
మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడల్ని వ్యతిరేకిస్తూ.. పార్టీ హైకమాండ్కు విషయం చేరవేయడమే లక్ష్యంగా.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు నివాసంలో స్పెషల్గా మీటైన ఎమ్మెల్యేలు.. పొలిటికల్ సంచలనానికి కారకులయ్యారు. తమతో సంప్రదించకుండానే మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనీ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ఏమాత్రం లెక్కచేయడంలేదని ఆరోపించారు. దీనిపై అధిష్టానం స్పందించాలని కూడా కోరారు. అయితే, ఎపిసోడ్ అంతా పార్టీతో సంబంధం లేకుండా.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగానే అనిపించినా.. పొలిటికల్గా కలకలం సృష్టించిన మాట వాస్తవం.
అయితే, మంత్రిపై అంతెత్తున్న ఎగిరిపడ్డ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంటయ్యారు. దీంతో, మల్లారెడ్డి పై అసమ్మతి రాగం తీసిన ఎమ్మెల్యేల తదుపరి వ్యూహం ఏంటా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 మంది ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడమే ఎక్కువనుకుంటే.. ఆ తర్వాత వాళ్లు ఓ రేంజ్లో మంత్రిపై దుమ్మెత్తిపోశారు. దీన్నిబట్టి వారి తరువాతి స్టెప్ బలంగానే ఉంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. తాము మంత్రి తీరుకే వ్యతిరేకం తప్ప.. పార్టీకి కాదంటూ ఎమ్మెల్యేలు అప్పుడే క్లారిటీ ఇవ్వడంతో పార్టీకి డ్యామేజ్ కాస్త కంట్రోల్ అయ్యిందనే భావించారు.
సొంత రాష్ట్రంలో.. అదీ రాజధాని హైదరాబాద్లో.. ఈ స్థాయిలో పొలిటికల్ పొగలు రేపిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు సడెన్గా పక్కరాష్ట్రం ఏపీలో ప్రత్యక్ష మవడం రాజకీయవర్గాల్ని ఆశ్చర్యపరిచింది. అదీ.. తిరుమల కొండమీద కనిపించడం.. మరో కొత్త చర్చకు దారి తీసింది. మైనంపల్లి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అయితే, మొన్నటి ఎపిసోడ్లో కనిపించని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్.. ఇవాళ మైనంపల్లి గ్రూప్లో కనిపించడం కొత్త విశేషం.
మంత్రిపై ఆస్థాయిలో విమర్శలు గుప్పించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇంత జరిగినా కూడా.. ఇదంతా మా ఫ్యామిలీ సమస్య అంటూ మల్లారెడ్డి అనడం.. ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మాట్లాడుతానంటూ ప్రకటించడం.. వ్యవహారాన్ని అప్పటికి కూల్ చేసింది. అయితే, ఇప్పటివరకూ ఎమ్మెల్యేలను మంత్రీ కలవలేదు.. ఆయన గురించి ఎమ్మెల్యేలూ మళ్లీ మాట్లాడలేదు. అయితే, హైకమాండ్ హైలెవల్లో ఇచ్చిన వార్నింగ్తోనే.. అంతా సైలెంటయ్యారనే ముచ్చట వినిపిస్తోంది. తాజాగా, ఆ బ్యాచ్లోని మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుమలకు కలిసి వెళ్లడమే.. కొత్త గుసగుసలకు కారణమవుతోంది. మేడ్చల్ పంచాయితి సమసిపోయిందా? లేక కోల్డ్ వార్ నడుస్తూనే ఉందా? అనే అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..