Paddy Procurement: ఇవాళ్టి నుంచి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు.. కేంద్రాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం..

|

Apr 14, 2022 | 9:58 AM

తెలంగాణ యాసంగి రైతులకు గుడ్‌న్యూస్. యాసంగిలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధాన్యం కొనుగోలుపై సర్కారు ఫోకస్ పెట్టింది. 60 రోజుల్లో ధాన్యం కొనుగోలు

Paddy Procurement: ఇవాళ్టి నుంచి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు.. కేంద్రాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం..
Paddy Purchasing Centers
Follow us on

తెలంగాణ యాసంగి రైతులకు గుడ్‌న్యూస్. యాసంగిలో పండిన ప్రతి ధాన్యపు గింజను(Paddy Procurement) కొంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధాన్యం కొనుగోలుపై సర్కారు ఫోకస్ పెట్టింది. 60 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. గత వానాకాలం ధాన్యం సేకరణలో చోటుచేసుకున్న పొరపాట్లు పునరావృతం కాకుండా పౌర సరఫరాల శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. నిత్యం పర్యవేక్షించేందుకు ఒక్కో కొనుగోలు కేంద్రానికి ఒక నోడల్ అధికారి, రైస్‌ మిల్లుకు గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేసింది. ఏదైనా జిల్లాలో పంట అధికమై మిల్లింగ్ సామర్థ్యం తగ్గితే.. రైతులకు అన్యాయం జరగకుండా ఓ గెజిటెడ్ అధికారి స్వయంగా రైతు వెంట వెళ్లి ధాన్యం అన్‌లోడింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

అయితే ప్రతి ఏడాది గన్నీ బ్యాగుల సమస్య చెక్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. ముందుగానే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు కోటీ 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. కొత్తవి మరో 57 లక్షలు ఉన్నాయి. అవసరమైన 13 కోట్ల 40 లక్షల గన్నీ బ్యాగుల కోసం కేంద్ర జ్యూట్ కమిషనర్‌కు లేఖ రాస్తున్న పౌర సరఫరాల శాఖ… అందుకోసం రూ.527 కోట్లు ముందస్తు చెల్లింపులు చేస్తోంది.

ఇదిలావుంటే.. రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు అంచనా వేశాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం సరిహద్దుల్లో 51 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక రైతుల పంట మాత్రమే ఆధార్ కార్డు ఆధారంగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణ ప్రారంభమవుతున్న వేళ.. సరకు నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎఫ్​సీఐ గోదాముల్లో నిల్వ సామర్థ్యం సరిపడా ఉంది. అవి నిండుకుంటే గతేడాది తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో నిల్వ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!