
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ ఆప్.. మరో కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ.. అత్యాశే.. చివరికి ఒక కుటుంబానికి శాశ్వత చీకటిని మిగిల్చింది. జగిత్యాల లక్ష్మిపూర్కు చెందిన మహేష్ అనే గీత కార్మికుడు కుటుంబ పోషణ కోసం కష్టపడి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ఆప్లో దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మొదట కొంత లాభం వస్తున్నట్లు కనిపించడంతో మరింత డబ్బు పెట్టాడు. కానీ ఆ తర్వాత డబ్బులు నిలిచిపోవడం, అకౌంట్లు బ్లాక్ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Jeevan Reddy
పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పుల ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, బయట ఎదురైన మాటలు అతడిని మానసికంగా కుంగదీశాయి. ఆర్థిక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి పెరగడంతో చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో లక్ష్మిపూర్ గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..
మహేష్కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి అండ కోల్పోయిన ఈ చిన్నారుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారింది. బెట్టింగ్ మాయలో పడకపోతే ఈ రోజు మా కుటుంబం ఇలా అయ్యేది కాదు.. అంటూ బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
జగిత్యాల జిల్లాలో ఇటీవలి కాలంలో బెట్టింగ్ ఆప్స్ కారణంగా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్ను పూర్తిగా అరికట్టాలని, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేష్ ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..