Telangana: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్.. వాటిని నమ్మొద్దని సూచన

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ అప్‌డేట్ ఇచ్చాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందనేవి కేవలం వదంతులేనని తేల్చిచెప్పాయి. ఈ నెలలోనే ఇంధన అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగినా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.

Telangana: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్.. వాటిని నమ్మొద్దని సూచన
No Fuel Shortage In Telangana

Updated on: May 18, 2026 | 5:28 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పష్టతనిచ్చాయి. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా ఎలాంటి కొరత లేదని ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, రవాణా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన వినియోగం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం వృద్ధి, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయి. డిమాండ్ ఎంత ఉన్నా సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీలు భరోసా ఇచ్చాయి.

ఎండల దెబ్బకు తగ్గిన గ్యాస్ బుకింగ్స్

వేసవిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ కొంత తగ్గుముఖం పట్టినట్లు ఓఎంసీలు తెలిపాయి. సాధారణంగా ఇలాంటి రోజుల్లో వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేయడానికి ఆసక్తి చూపించరని, ప్రస్తుత ట్రెండ్ ఈ సీజన్‌కు సాధారణమేనని తెలిపాయి. ఈ నెలలో 17 తేదీ వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను విజయవంతంగా డెలివరీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. వినియోగదారులు గ్యాస్ బుకింగ్స్ కోసం ఇబ్బంది పడకుండా ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్ వేదికల ద్వారా సులభంగా బుక్ చేసుకోవాలని కంపెనీలు సూచించాయి.

ఓటీపీ ఉంటేనే సిలిండర్.. 95 శాతం పూర్తి

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు, అసలైన లబ్ధిదారులకే సిలిండర్ అందేలా చూసేందుకు ఓఎంసీలు డెలివరీ అథెంటికేషన్ కోడ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాయి. ఈ ఓటీపీ ఆధారిత డెలివరీ విధానం తెలంగాణలో ప్రస్తుతం 95 శాతానికి పైగా విజయవంతంగా అమలవుతోంది. దీనిని వంద శాతానికి చేర్చడమే లక్ష్యంగా గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, ఇందుకు వినియోగదారులు కూడా సహకరించి డెలివరీ సమయంలో ఓటీపీని షేర్ చేయాలని కోరారు.

ఆయిల్ కంపెనీల హెచ్చరిక

సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో ఇంధన కొరతపై వచ్చే నకిలీ వార్తలను, వదంతులను నమ్మి సామాన్య ప్రజలు ఆందోళన చెందవద్దని ఓఎంసీలు విజ్ఞప్తి చేశాయి. కేవలం అధికారిక, విశ్వసనీయ సంస్థలు అందించే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరాయి.

Follow Us