
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం సాతండాకు చెందిన రామారావు-సుజాత దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. కూతురికి వివాహం చేయగా, కొడుకు చంటి (22) చదువుకుంటున్నాడు. సుజాతకు కొడుకే లోకం.. తనయుడు ఉన్నత చదివి జీవితంలో ఎదగాలని ఆశ. తల్లి ఆశలను నిజం చేసేందుకు చంటి హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. సెలవుల్లో భాగంగా రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి సుజాతకు కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతోంది. దీంతో కంటి చికిత్స కోసం మిర్యాలగూడకు బైక్పై తల్లిని తీసుకు వచ్చాడు. కంటి డాక్టర్కు తల్లిని చూపించి తిరిగి తండాకు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై డీసీఎం వ్యాన్.. వెనక నుంచి వీరి బైక్ను ఢీ కొట్టింది. కింద పడిపోయిన తల్లి కొడుకులపై నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన చంటి మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
రెండు.. మూడేళ్లలో ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడనుకునే సమయానికి తల్లీ, తనయుడు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తండాలో బంధువుల రోదన పలువురిని కలచి వేసింది. డీసీఎం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చంటి తండ్రి రామారావు తండ్రి రాంజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..