రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన అసదుద్దీన్‌..! కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

మొహమ్మద్ అసదుద్దీన్, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. క్రికెట్ ఆటగాడిగా తన కెరీర్ తర్వాత, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.

రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన అసదుద్దీన్‌..! కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
Congress Flag

Edited By: TV9 Telugu

Updated on: Jun 25, 2025 | 1:05 PM

తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ.. మొహమ్మద్‌ అసదుద్దీన్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం ప్రారంభంలో కాంగ్రెస్‌కు పార్టీ నాయకత్వం నియమించిన 69 మంది ప్రధాన కార్యదర్శులలో భారత మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ మొహమ్మద్‌ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్‌ అసదుద్దీన్‌కు కూడా చోటు దక్కింది. దీంతో అతను అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. అసదుద్దీన్ తొలుత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని.. రంజీ వరకు ఆడాడు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ స్థానం ఖాళీ కావడంతో 35 ఏళ్ల అసదుద్దీన్ నియామకం జరిగింది. దీంతో రాబోయే ఉప ఎన్నికల్లో అసదుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నవంబర్ 2023 తెలంగాణ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ముందస్తు ఆధిక్యాన్ని పొందిన తర్వాత బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపినాథ్‌ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఆ ఎన్నికల్లోనే అసదుద్దీన్, తన తండ్రి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు, నియోజకవర్గం అంతటా ర్యాలీలు, మొహల్లా సమావేశాలు నిర్వహించాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందే ముందు, అసదుద్దీన్ తెలంగాణలో యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కార్యదర్శిగా పనిచేశారు. అసదుద్దీన్ లా డిగ్రీ పూర్తి చేశాడు. అలాగే భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను వివాహం చేసుకున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి