
నగరంలోని మియాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారితో కలిసి అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మయూరినగర్కు చెందిన ఈషా సాహు (37) తన కుటుంబంతో కలిసి మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఆమె తన ఆరు నెలల కుమార్తె వాణిని తీసుకుని ఆరవ అంతస్తు నుంచి దూకినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె దూకిన విషయాన్ని స్థానికులు గుర్తించి వెంటనే చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడలేదు.
మధ్యప్రదేశ్కు చెందిన ఈషా సాహుకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తె విదీతో పాటు ఆరు నెలల చిన్నారి వాణి ఉన్నారు. ఈషా, ఆమె భర్త ఇద్దరూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండో బిడ్డ జననం తర్వాత ఈషా తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. అదే కారణంగా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం సుమారు 3.45 గంటల సమయంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులు, పొరుగువారిని విచారిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి