
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టూర్కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన రాహుల్, అనంతరం ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండపల్లి వద్ద బావిలో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయాడు అనుకున్న కుమారుడు ఇంటికి శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ హైదరాబాద్ సైదాబాద్లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను లక్ష్మీ కళ హాస్టల్లో ఉంటూ, నాదర్గుల్లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రాజెక్టు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. గత నెల 27న టూర్కు వెళ్తున్నానని చెప్పిన రాహుల్ను ఓ స్నేహితుడు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దింపాడు. అక్కడి నుంచి MMTS రైలులో సికింద్రాబాద్ చేరుకున్న అతను, అనంతరం శబరి ఎక్స్ప్రెస్లో ఒంగోలు వైపు ప్రయాణించాడు.
అయితే ఏం జరిగిందో తెలియదు కాని సింగరాయకొండపల్లి రైల్వే స్టేషన్లో దిగిన రాహుల్, అక్కడ సమీపంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గత నెల 30న గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి చేశారు. ఇదిలా ఉండగా, కొడుకు ట్రైన్లో వెళ్లాడని తెలిసిన రాహుల్ తండ్రి గత నెల 31న కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాహుల్ ఆచూకీ కోసం గాలించారు.
ఈ క్రమంలోనే కాచిగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి రాహుల్ ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. అతను సింగరాయకొండపల్లి రైల్వే స్టేషన్లో దిగినట్లు నిర్ధారించిన అనంతరం, అక్కడి పోలీసులతో సమన్వయం చేయగా రాహుల్ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ మృతికి కారణాలు ఏంటన్నది మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఈ విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.