
మొదట సాధారణ అనుమానాస్పద మరణాలుగా కనిపించిన ఆ రెండు ఘటనలు.. ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఇదే గ్రామానికి చెందిన చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ ప్రసన్న మృతి విషయం తెలుసుకున్న చరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రాత్రి గ్రామ శివారులోని తాటి చెట్టుకు ఉరివేసుకుని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు ఇళ్లలో ఒకే రాత్రి విషాదం నెలకొంది.
లక్ష్మీ ప్రసన్న కుటుంబం చేసిన ఆరోపణలతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదని.. గ్రామానికి చెందిన చరణే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు చరణ్ చేసిన పని ఇప్పుడు కేసులో మరింత ఉత్కంఠ పెంచుతుంది. తన తండ్రి సమాధిపై స్వయంగా రక్తంతో కొన్ని పేర్లు రాశాడు. దీంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. మొదట ఆత్మహత్యగా కనిపించిన ఘటనలో ఇతర కోణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. చరణ్ వేధింపుల వల్లే లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ డబుల్ సూసైడ్ ఘటనపై మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, చాటింగ్ వివరాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నామని ఎస్సై రవీందర్ చెబుతున్నారు.