
చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం ఈ మధ్య కామన్గా మారింది. భర్త తిట్టాడని భార్య, భార్య ప్రవర్తన నచ్చక భర్త ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విషాదం ఘటన చోటుచేసుకుంది. మనస్పర్థలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యతో గొడవలు, తోడుగా ఉండాల్సిన ఆవిడ విడాకుల నోటీసు పంపడాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘాట్కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్లో చోటుచేసుకుంది. ఎదులాబాద్ గ్రామానికి చెందిన వెంకటేష్ వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2019లో కీసరకు చెందిన మౌనికతో ఇతనికి వివాహం జరిగింది. మౌనిక ప్రస్తుతం కీసరలోని ఓ గురుకుల పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తోంది. వివాహమై ఐదేళ్లు గడుస్తున్నా వీరిద్దరికీ సంతానం కలగలేదు.
గత కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు మొదలై, అవి కాస్తా పెద్దవయ్యాయి. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌనిక కోర్టు ద్వారా వెంకటేష్కు విడాకుల నోటీసులు పంపింది. ప్రాణంగా ప్రేమించిన భార్య తనను శాశ్వతంగా వదిలి వెళ్లబోతోందనే వార్త వెంకటేష్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. నోటీసు అందినప్పటి నుండి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వెంకటేష్, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి అతను ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న ఘాట్కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..