
వాహనాలను దొంగలించబడిన, ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన యజమానులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. మల్కాజిగిరి పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సీజ్ చేసిన మొత్తం 446 రకాల వాహనాలను వేలం వేయడానికి పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇందులో ఫోర్ వీలర్లు, త్రీ వీలర్లు, టూ వీలర్లు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ వాహనాలన్నింటినీ అంబర్పేట్లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్టు తెలిపింది. అయితే, వీటిలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలను మాత్రం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పూలింగ్ పాయింట్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సీజ్ చేసిన ఈ మొత్తం 446 వాహనాలను మల్కాజిగిరి పోలీస్ వారి ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్టు తెలిపింది. సైబరాబాద్- మల్కాజిగిరి యాక్ట్ 7, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348-F లోని సెక్షన్ 39(b), 40 అండ్ 41 తో పాటు, మల్కాజిగిరి చట్టం (No. IX) కింద గల సెక్షన్ 22(1) (a) నుండి (f), 22(2) (a) నుండి (b), 22(3) నిబంధనల ప్రకారం ఈ వేలం జరపనున్నట్టు స్పష్టం చేసింది. వేలంవేయబోయే వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.malkajgiripolice.telangana.gov.in అనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.
యజమానులకు ఆరు నెలల గడువు
అయితే ఈ వాహనాల అసలు యజమానులు, ఫైనాన్స్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి 6 నెలల లోపు వాహనానికి సంబంధించిన సరైన, అసలైన పత్రాలతో అంబర్పేట్లోని “DCP CAR HQrts, మల్కాజ్గిరి ఆఫీస్ను సంప్రదించాలని తెలిపింది. యజమానులు అందించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించనున్నట్టు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వస్తే వాహనాలను పొందలేరని స్పష్టం చేశారు. వాహనాల వివరాలు, ఇతర సమాచారం కోసం 8008338535, 8712662661 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.