
హైదరాబాద్ శివారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో భారీగా విదేశీ మద్యం నిల్వ చేసి అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి, కాప్రా ఎక్సైజ్ స్టేషన్లకు చెందిన అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ మద్యం వ్యాపారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, జవహర్నగర్కు చెందిన రెడ్డి శెట్టి మహేష్ (50), రెడ్డి శెట్టి శ్రీనివాస్ (52) గోవా, ఇతర ప్రాంతాల నుంచి విదేశీ మద్యాన్ని తెప్పించి అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు దాడులు నిర్వహించగా, వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన మొత్తం 251 విస్కీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం పరిమాణం 129.66 లీటర్లుగా అధికారులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు. అనంతరం భారతీయ న్యాయ సంహిత (BNS)-2023లోని సెక్షన్ 35(3) ప్రకారం వారికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అక్రమ మద్యం రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..