
రాష్ట్రంలో ఏ మూలన విన్న అంతా మున్సిపల్ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. ఇక ఇటీవలే నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. రెగ్యూలర్ గా వార్డుల్లో ప్రచారాలతో పాటు డిజిటల్ ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. అందుకు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని నేరుగా ఓటర్ల ఫోన్లలోనే వీడియోలు, ఫోటోల రూపంతో చేరువవుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గతంలో అనుసరించే సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకొని స్మార్ట్ క్యాంపెయినింగ్ కు శ్రీకారం చుడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ట్గ్రామ్ మొదలగు మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా వీడియోలు రూపొందిస్తున్నారు. అలాగే గతంలో ఆయా పార్టీల అధికారంలో ఉండగా చేసిన పనులను గుర్తు చేస్తున్నారు. డిజిటల్ ప్రచారంతో ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువ కావడంతో అభ్యర్థులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు కుటుంబంలో ప్రతిఒక్కరికి మొబైల్ ఫోన్లు ఉండడంతో ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా మారింది. కంప్యూటర్, మొబైల్ సాయంతో రూపొందించిన సందేశాలను ఒకేసారి వందల మందికి పంపే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇక మొత్తం వ్యవహారం నడిపించేందుకు ఒకరు, ఇద్దరిని ప్రత్యేకంగా నియామకం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారికి కొంత మొత్తం నగదు చెల్లిస్తున్నారు. రోజువారీ ముందస్తు ప్రచార వివరాలు, నిర్వహిస్తున్న క్యాంపెయినింగ్ అంశాలను వీరు అభ్యర్థుల సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పాటు… కార్యకర్తలకు పంపి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అభ్యర్థులకు అరచేతిలోనే ప్రచారాస్త్రంగా డిజిటల్ మీడియా మారిపోయింది.