Telugu News Telangana Lost Money in a Cyber Fraud? Here's How to Claim Your Refund Through the MRM Portal
సైబర్ మోసంలో డబ్బు పోయిందా? MRM ద్వారా రీఫండ్ పొందే అవకాశం.. ఇలా అప్లై చేయండి!
Cyber Fraud Refund: సైబర్ మోసాల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన Money Restoration Module (MRM) ద్వారా రీఫండ్ పొందే అవకాశం కల్పించింది. అయితే అధికారిక పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేయాలని, OTPలు లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
Money Restoration Module: సైబర్ నేరాల బారినపడి డబ్బు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచనలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ద్వారా అర్హులైన బాధితులు తాము కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే రీఫండ్ కోసం కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేయాలని, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని హెచ్చరించింది.
ఎవరు రీఫండ్కు అర్హులు?
హోంమంత్రిత్వ శాఖ నుంచి SMS లేదా అధికారిక నోటిఫికేషన్ అందుకున్న సైబర్ మోసాల బాధితులు మాత్రమే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లోని MRM ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టపరమైన, బ్యాంకింగ్ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది.
MRM ద్వారా రీఫండ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
మీ సైబర్ ఫిర్యాదుకు అనుసంధానమైన (లింక్ చేసిన) మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి.
OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.
అర్హత కలిగిన ఫిర్యాదు, సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేయాలి.
అవసరమైతే PAN కార్డు వివరాలను అప్లోడ్ చేసి గుర్తింపును ధృవీకరించాలి. రీఫండ్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
అనంతరం పోర్టల్లో రీఫండ్ అభ్యర్థనను సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించిన తర్వాత చట్టపరమైన, పరిపాలనా మార్గదర్శకాల ప్రకారం పరిశీలన జరుగుతుంది.
అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత అర్హత ఉన్న మొత్తం నేరుగా బాధితుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
సహాయం కావాలంటే?
రీఫండ్ ప్రక్రియపై సందేహాలు ఉంటే లేదా సహాయం అవసరమైతే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్డెస్క్ 8712665600 నంబర్ను సంప్రదించవచ్చు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా సంప్రదించవచ్చు.