
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల ధరలను సవరించడంపై పూర్తిగా ఆధ్యయనం చేయాలని తాజాగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో రాష్ట్రంలో భూముల విలువను పెంచనున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రభుత్వం హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రెడ్డు లోపల ఉన్న భూముల విలువను సవరించేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. ఆ తర్వాత భూముల విలువను పెంచాలని నివేదికలు కూడా సిద్దం చేశారు. అధికారులు ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టింది.
జీహెచ్ఎంసీలో చేపట్టినట్లు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో భూముల విలువను పెంచడంపై అధ్యయనం చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో త్వరలో భూముల ధరలను ప్రభుత్వం పెంచడంపై నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరుగుతాయి. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్పై కాస్త ప్రభావం చూపించనుంది.
ఇక తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ద్వారా అధిక ఆదాయం వస్తున్న ప్రాంతాల్లో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ప్రభుత్వం పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేచోట చేర్చి సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ రిజిస్ట్రార్ కార్యాలయలు ఒకేచోట ఉండేలా భవన సముదాయాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్లతో పాటు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కూడా చేయనున్నారు. ఇక ఈ భవనాలకు ఇటీవల కొన్ని జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ భవనాల్లో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వృద్దులు, వికలాంగులకు వెయిటింగ్ హాల్స్, ఫీడింగ్ కోసం గర్బిణులకు ప్రత్యేక రూమ్లు వంటివి ఉంటాయి. ఇక ఇక్కడ మ్యారేజ్ హాల్స్ కూడా ఉంటాయి. ప్రతి జిల్లాలోనూ సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించనున్నారు.