
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్గా మారింది. రోజుకో ట్విస్ట్తో తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావును అరెస్టు చేశారు. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్లో ఈ విషయాలను వెల్లడించారు.
మరో వైపు అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసులతో రివ్యూ నిర్వహించారు. సీఎం అధికారులతో భేటీ అయిన రెండో రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…