
సీనియర్ల వేధింపులకు మరో విద్యా కుసుమం అర్ధాంతరంగా రాలిపోయింది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగింది ఈ దారుణం. దొంగతనం ఆరోపణలతో తోటి విద్యార్థినులు హాస్టల్ లో బంధించి కొట్టడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది శ్రీవిద్య అనే పీజీ విద్యార్ధిని.. శ్రీవిద్య.. ప్రాపర్ ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం బనిగండ్లపాడు విలేజ్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్. కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అదే బ్లాక్లో ఉంటున్న కొంతమంది స్టూడెంట్స్తో ఈనెల 4న శ్రీవిద్యకు గొడవ జరిగింది. రూమ్లో ల్యాప్టాప్లతో పాటు గోల్డ్ పోయిందన్నది ఆ గొడవ సారాంశం. అదే విషయంపై స్టూడెంట్స్ కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులను స్టేషన్కు పిలిచిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
శ్రీవిద్యపై దొంగతనం నింద మోపడం.. రూమ్లో బంధించి చేయి చేసుకున్నారన్న సమాచారంతో కుటుంబసభ్యులు క్యాంపస్ వెళ్లారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. డిస్టర్బ్గా ఉన్న బిడ్డను ఈనెల 7న ఇంటికి తీసుకెళ్లారు. వర్సిటీలో అవమానం జరిగిందని భావించిందో.. మళ్లీ క్యాంపస్లో అడుగు పెట్టకూడదని డిసైడ్ అయిందో తెలియదు.. ఇంటికెళ్లిన రోజునే ఎలుకల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. గమనించిన పేరెంట్స్ మధిరలోని ఓ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్లో అడ్మిట్ చేశారు.
శ్రీవిద్య బతుకుతుంది.. ఎప్పట్లాగే ఇంటికొస్తుంది.. వర్సిటీకి వెళ్లి చదువుకుటుందని కన్నవాళ్లు భావించారు. కానీ,13 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడవడంతో తల్లిదండ్రుల గుండె చెరువయింది. అన్యాయంగా తమ బిడ్డను కొంతమంది ర్యాగింగ్ పేరుతో వేధించారని.. ఆ కారణంగానే చనిపోయిందని ఆరోపించారు.
శ్రీవిద్య ఆత్మహత్యకు కారణమేంటి? క్యాంపస్లో ర్యాగింగ్ జరిగిందా? ర్యాగింగ్ జరిగినా అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారా? అసలు వర్సిటీ అధికారులు ఏమంటున్నారు?
హాస్టల్లో దొంగతనం నెపం.. పీఎస్లో కౌన్సిలింగ్.. ఇది మాత్రమే అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీవిద్య మాత్రం సీనియర్లు ర్యాగింగ్ చేశారు.. నిర్బంధించి కొట్టారని మరణవాంగ్మూలం ఇచ్చిందని పేరెంట్స్ చెబుతున్నారు.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పీజీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్యకు నిరసనగా కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగాయి విద్యార్ధి సంఘాలు. మృతురాలు శ్రీవిద్య ఫోటోలతో నిరనస చేపట్టిన విద్యార్ధులు..ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
ఏది నిజం..? ఏది అబద్ధం..? శ్రీవిద్య అంటే గిట్టనివాళ్లు చేసిన కుట్ర ఫలితమే సూసైడా? లేదంటే తనే అనాలోచితంగా అవేశపూరిత నిర్ణయం తీసుకుందా? నిజనిజాలేంటన్నది పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..