
ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లె పూల సువాసన మన మనసును ఆహ్లాదపరుస్తుంది. అయితే చాలామంది తమ మల్లె మొక్కలు సరిగ్గా పూయడం లేదని బాధపడుతుంటారు. మల్లె మొక్కకు ఏప్రిల్, మే నెలల్లో వచ్చే విపరీతమైన ఎండలను తట్టుకునే శక్తిని ఇస్తూనే, విపరీతంగా పూలు పూయించే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకోండి. ముందుగా నీరు చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు త్వరగా ఎండిపోతాయి. కాబట్టి ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీరు పోయాలి. నీరు సరిపోకపోతే మొక్క తలలు వాల్చేస్తుంది.
రెండోది సాఫ్ట్ ప్రూనింగ్. పువ్వులు పూసి ఎండిపోయిన కొమ్మలను ఒక ఆకు కింద వరకు కట్ చేయాలి. మల్లె మొక్కలకు ఎప్పుడూ కొత్తగా వచ్చే చిగుర్లకే పూలు వస్తాయి. పాత కొమ్మలకు పూలు రావు, కాబట్టి ట్రిమ్మింగ్ చేయడం తప్పనిసరి. ఇక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే.. ఇంట్లో వృధాగా పడేసే పదార్థాలతో ఒక లిక్విడ్ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒక బకెట్ నీటిలో బియ్యం కడిగిన నీరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీరు, లేదా పాత మజ్జిగను కలిపి ఒక రోజంతా పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని మళ్ళీ సాధారణ నీటితో డైల్యూట్ చేసి(పలచగా చేసి) మొక్కలకు ఇవ్వాలి. దీనివల్ల మొక్కకు కావలసిన నైట్రోజన్, పొటాషియం అందుతాయి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడూ సాయంత్రం వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ఉదయం పూట ఇస్తే ఎండకు ఆవిరి అయిపోతాయి. సాయంత్రం ఇస్తే రాత్రంతా మొక్క ఆ పోషకాలను నిదానంగా గ్రహిస్తుంది. ఇలా వారం లేదా పది రోజులకు ఒకసారి చేస్తూ, ఎప్పటికప్పుడు ఎండు కొమ్మలను తొలగిస్తుంటే.. మీ మల్లె మొక్క మొగ్గలతో కళకళలాడుతుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా మొక్క ఆరోగ్యంగా పెరిగి మీకు నిండుగా పూలను ఇస్తుంది.