
జగిత్యాల జిల్లాలోని రంగసాగర్ గ్రామ ప్రజలకు క్షుద్రపూజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తు్న్నాయి. తాజాగా, గ్రామానికి చెందిన శ్రీరాముల గంగయ్య పొలం వద్ద ఉన్న చింత చెట్టు ముందు గత మూడు రోజుల నుండి ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త పద్ధతిలో, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రితో ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.
అయితే గతంలోనూ నాగవత్ రాజేష్ నాయక్ ఇంటి ముందు ఇలాంటి పూజలే జరిగాయి. ఆ తర్వాత బాణావత్ గంగారాం ఇంటి పక్కన కూడా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నారో తెలియక గ్రామస్థులు భయాందోళనకు లోనవుతున్నారు.
ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు స్పందించి, రాత్రి పూట గస్తీ పెంచి, ఈ పనులకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవాలని రంగసాగర్ గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతి ఆదివారం ఇదే విధంగా పూజలు చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.