
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోనివారు ఉంటే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు పరిశీలించి అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ఇళ్లను మంజూరు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కరెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పొంగులేటి తెలిపారు. అలాగే కలెక్టర్లు ప్రతీ వారం జిల్లా హౌసింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణం, వాటి పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణం త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒకవేళ మంజూరు అయినవారు ఇల్లు నిర్మించుకోకపోతే వేరేవారికి అవకాశం కల్పిస్తామని పొంగులేటి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించి మూడు విడతల్లో బిల్లులు పొందినవారికి చివరి విడత బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇల్లు పూర్తిస్థాయిలో పూర్తి కాకపోయినా రంగులు, ప్లాస్టరింగ్ వంటి వాటిని చేస్తే తుది విడత రూ.లక్ష జమ త్వరలో చేయనుంది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. నాలుగు విడతల్లో ఇప్పటివరకు నగదు జమ చేస్తున్నారు. పునాదికి రూ.లక్ష, రూఫ్ లెవర్ రూ.లక్ష, స్లాబ్ లెవల్ రూ.2 లక్షలు, గృహప్రవేశానికి సిద్దంగా ఉంటే రూ.లక్ష అందిస్తోంది. స్థలం ఉండి కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి మొత్తం రూ.5 లక్షల ఆర్దిక సాయం అందిస్తోంది.