
గ్రేటర్ హైదరాబాద్లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
-తమ నియోజకవర్గం పరిధిలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు
-వాట్సప్ నెంబర్ 80969 58096 ద్వారా అప్లై చేసుకోవచ్చు
-ఇక మీ సేవ వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హులైనవారు ఆగస్ట్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి అప్లై చేసుకోవాలి. దీంతో అధికారులు మీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు.
దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఇది వెనక్కి ఇవ్వరు. ఇక టోకెన్ అడ్వాన్స్ కింద రూ.10 వేలు చెల్లించాలి. అయితే మీకు ఇళ్లు కేటాయించకపోతే ఈ డబ్బులు వెనక్కి వస్తాయి. ఒకవేళ ఇల్లు కేటాయిస్తే లబ్దిదారుల వాటాలో సర్దుబాటు చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు ద్వారా అప్లై చేసుకోవాలి.
-పదేళ్లు క్యూఆర్ పరిధిలో ఖచ్చితంగా నివసించి ఉండాలి
-సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి ఉండకూడదు
-గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు
-ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి
-వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలి
బహుళ అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించి లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం రూ.5 లక్షల రాయితీ అందించనుండగా.. లబ్దిదారుడు మిగతా రూ.6 లక్షలు చెల్లించాలి. ఇల్లు కేటాయింపు సమయంలో రూ.లక్ష, ఆర్సీసీ నిర్మాణ సమయంలో రూ.2 లక్షలు, ముగింపు దశలో రూ.2 లక్షలు, అప్పగించే సమయంలో మిగతా సొమ్ము చెల్లించాలి. వీటిని లబ్దిదారుడు విక్రయించడానికి కుదరదు.