కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఉండే సునీల్ అనే ఓ యువకుడు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సునీల్, అతడు ప్రేమించిన అమ్మాయి ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను తిరస్కరించారు. అయినప్పటికీ ఆ యువతి సునీల్ ప్రేమను కొనసాగించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు యువతి కుటుంబ సభ్యులు. అగ్రకులానికి చెందిన తమ అమ్మాయిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటావని సునీల్ ఇంటిపై దాడి చేశారు. నలుగురిలో తిరిగే వ్యక్తి కావడంతో అవమానభారంతో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సునీల్. సునీల్ మరణవార్తతో అటు స్నేహితులు, ఇటు కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన సునీల్ అనే వ్యక్తి అగ్ర కులానికి చెందిన యువతిని గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో.. ఆమె కుటుంబ సభ్యులు సునీల్ను బెదిరించారు. యువతి వైపు చూసినా.. మాట్లాడిన బాగుండదని హెచ్చరించారు. సునీల్ సోమవారం రాత్రి నిజాంపేట్లో ఓ మద్యం దుకాణానికి వెళ్లగా.. అక్కడ యువతి సోదరుడు, అతడి స్నేహితులు దాడి చేసి సునీల్ను గాయపరిచారు. అదేరోజు రాత్రి సునీల్ ఇంటిపై దాడికి దిగారు. యువతి కుటుంబ సభ్యులు ‘నీకు మా అమ్మాయి కావాలా అంటూ..’ సునీల్పై దాడికి దిగడంతో అతని స్నేహితుల సైతం అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం లేచి చూసేసరికి సునీల్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ‘నా చావుకి ప్రియురాలి కుటుంబ సభ్యులే కారణమని’ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. యువతి కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు యువకుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూకట్పల్లి ఏసీపీ తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..