
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అమెరికాలోని ప్రభుత్వ నిధులతో నడిచే మెడికేర్ ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఓ టెక్సాస్ ల్యాబొరేటరీ యజమానిపై నమోదయ్యాయి. ‘అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్’ అనే జన్యుపరీక్షల ల్యాబ్లో జన్యు పరీక్షలకు సంబంధించి సుమారు 93 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.800 కోట్లకు పైగా) తప్పుడు క్లెయిమ్లను సమర్పించినట్లు అమెరికా ఫెడరల్ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో ఖదీర్ఖాన్ 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబరు మధ్యకాలంలో సుమారు 93 మిలియన్ డాలర్ల నకిలీ మెడికల్ క్లెయిమ్లను అమెరికా ప్రభుత్వానికి సమర్పించాడు. వీటిలో కనీసం 63 మిలియన్ డాలర్ల క్లెయిమ్లకు మెడికేర్ చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. టెక్సాస్లోని రిచర్డ్సన్కు చెందిన American Premier Labs LLC యజమాని ఖదీర్ ఖాన్ మొహమ్మద్ (46) ఈ వ్యవహారానికి పాల్పడ్డాడు.
మొహమ్మద్కు సంబంధించినట్లు భావిస్తున్న క్లెయిమ్లలో సుమారు 13 మిలియన్ డాలర్ల విలువైనవి కేవలం 10 రోజుల వ్యవధిలోనే సమర్పించబడినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సమయంలో మొహమ్మద్ నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 6 మిలియన్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెడికేర్ లబ్ధిదారులకు నిర్వహించిన జన్యు పరీక్షలకు సంబంధించి అర్హత లేని మెడికేర్ రీయింబర్స్మెంట్కు అర్హత లేని క్లెయిమ్లను సమర్పించినట్లు మొహమ్మద్పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వైద్యులు ఆ పరీక్షలను ఆదేశించకపోయినా.. వారు ఆదేశించినట్లుగా నకిలీ క్లెయిమ్లు సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా కొంతమంది వైద్యుల వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఉపయోగించినట్లు ఆరోపించారు. ఆ వైద్యులకు సంబంధంలేని మెడికేర్ లబ్ధిదారుల పేర్లపై జన్యు పరీక్షలకు సంబంధించిన క్లెయిమ్లు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షలను సంబంధిత వైద్యులు ఆదేశించలేదని, అలాగే మెడికేర్ లబ్ధిదారుల వైద్య చికిత్సలో వాటిని ఉపయోగించలేదని ఫెడరల్ అధికారులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన టెక్సాస్ అధికారులు ఖదీర్ఖాన్ను పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుల (fugitive) జాబితాలో చేర్చారు. అమెరికా నుంచి పారిపోయి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. అయితే మొహమ్మద్పై కేసు ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో అతడిపై నేర నిర్ధారణ జరగలేదు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు అతడు నిర్దోషిగానే పరిగణించబడతారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి వస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు.