Hyderabad: ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..

|

Aug 03, 2024 | 8:39 AM

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. డ్రగ్స్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. హైదరాబాద్‌ హాస్టల్స్‌లోనూ దాడులు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో రైడ్స్‌ చేయగా డ్రగ్స్‌, గంజాయి పట్టుబడడం కలకలం రేపుతోంది.

Hyderabad: ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..
Hostel Room
Follow us on

హైదరాబాద్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు రూటు మార్చాయి. నిన్నమొన్నటివరకూ పబ్‌లు, విద్యాసంస్థలు, ఐటీ ఆఫీసుల్లో దాడులు చేసిన పోలీసులు.. ఇప్పుడు హైదరాబాద్‌లోని హాస్టళ్లపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ బాయ్స్‌ హాస్టల్‌లో డ్రగ్స్, గంజాయి దొరకడం కలకలం రేపింది. ఎస్‌ఆర్‌నగర్‌లోని వెంకట్‌ బాయ్స్‌ హాస్టల్‌లో తనిఖీలు చేయగా.. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల MDMA డ్రగ్స్‌ పట్టుబడడంతో సీజ్ చేశారు. దీనికి సంబంధించి ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్‌ అధికారులు.. గత కొన్నాళ్లుగా ఎస్‌ఆర్‌నగర్‌ హాస్టల్‌ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేల్చారు.

అయితే.. ఇటీవల అరెస్ట్‌ అయిన మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్‌ కేసు నిందితులు ఇచ్చిన వివరాలతోనే ఎస్‌ఆర్‌నగర్‌ బాయ్స్‌ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించామన్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి. మాదాపూర్‌ క్లౌడ్‌నైన్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీని భగ్నం చేసి.. 20 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎస్‌ఆర్‌నగర్‌ హాస్టల్స్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నాగరాజుయాదవ్ బర్త్‌డే సందర్భంగా గోవా నుండి డ్రగ్స్ తెప్పించి రేవు పార్టీ నిర్వహించగా.. ఐదుగురిని నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇక.. నాగరాజుతో పాటు గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చిన మరో నిందితుడు నిఖిల్‌ను విచారించగా.. లోకేష్ అనే మరో వ్యక్తికీ డ్రగ్స్ దందాలో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పాడన్నారు. దాంతో.. లోకేష్ గురించి వివరాలు సేకరించిన ఎక్సైజ్ పోలీసులు.. ఎస్‌ఆర్‌నగర్‌లోని వెంకట్‌ బాయ్స్ హాస్టల్‌లో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు కమలాసన్‌రెడ్డి.

ఆ తర్వాత.. బాయ్స్ హాస్టల్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ నిర్వహించగా.. ముగ్గురు వ్యక్తుల దగ్గర డ్రగ్స్ లభించడంతో వారిని అరెస్ట్‌ చేశామన్నారు. చిత్తూరుకు చెందిన భారి, లోకేష్‌తోపాటు మరొకర్ని అరెస్ట్‌ చేశామని.. అయితే.. వీరికి డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యాయనేదానిపై మరింత లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పారు కమలాసన్‌రెడ్డి. మొత్తంగా.. హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లోనూ డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…