
తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఎప్పుడు విడుదల చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన కసరత్తు విద్యాశాఖ ముమ్మరం చేసింది. ఇటీవల ఎన్నికల విధుల్లో బిజీ అయిన అధికారులు తిరిగి తమ పనుల్లో పడ్డారు. తొలుత ఇంటర్ ఎగ్జామ్ తేదీలు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత టెన్త్ డేట్స్ కూడా విడుదల చేస్తారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించి వాల్యూయేషన్కు అడ్డంకులు లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇంటర్ బోర్డు ఇప్పటికే తేదీల విషయంలో ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 2024 మార్చి 1న ఇంటర్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకోకపోవడంతో షెడ్యూల్ విడుదలకు సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా మంత్రి వస్తే బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లో టైం టేబుల్ను విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గత అకాడమిక్ ఇయర్కు మార్చి 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్స్ పెట్టడంతో దానికి ప్రిపేర్ అవడానికి సరైన టైం స్టూడెంట్స్కి దొరకలేదు. ఈ ఏడాది జూన్ 1 నుంచే క్లాసులు నిర్వహించినందున మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్స్కు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో సీఎం అనుమతి ఇస్తే ఈ వారం రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రానుంది. ఇక ఇంటర్ షెడ్యూల్ విడుదలే ఆలస్యం వెంటనే పదో తరగతి పరీక్షల టైం టేబుల్ కూడా రిలీజ్ చేసేందుకు ఎస్ఎస్సీ బోర్డు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ వారం రోజుల్లో ఇంటర్ షెడ్యూల్ వస్తే డిసెంబర్ చివరి నాటికి టెన్త్ పరీక్షల తేదీలు ప్రకటించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ ముగియగానే వచ్చే ఏడాది మార్చి మూడో వారంలో నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. మార్చిలో అన్ని ఎగ్జామ్స్ను ముగించేలా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే డిసెంబర్ 12న సీఎం రేవంత్ రెడ్డి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.