
హైదరాబాద్లో షాదీ ముబారక్ పథకంలో భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల రూపాయల మేర మోసం చేసిన ముఠాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కిరణ్ను కూడా నిందితుడిగా చేర్చారు. షాదీ ముబారక్ స్కామ్లో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహమ్మద్ ఎతిమాద్ అనే వ్యక్తి.. తన సహచరులతో కలిసి ఫోటోషాప్, పెయింట్ సాఫ్ట్వేర్ల సహాయంతో వధువుల ఫోటోలు, ఆధార్ వివరాలు, వివాహ ధ్రువపత్రాలు తదితర పత్రాలను నకిలీగా తయారు చేశాడు. అనంతరం ఆ దరఖాస్తులను షాదీ ముబారక్ పథకం కింద సమర్పించి ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కిరణ్ సహకారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే దరఖాస్తులు తదుపరి ప్రక్రియకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు నిందితులు నకిలీ లబ్ధిదారులను గుర్తించడం, బ్యాంకు ఖాతాలు, విద్యుత్ బిల్లులు, వివాహ ఫోటోలు తదితర పత్రాలను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.
Hyderabad Fraud Case
నిందితుల నివాసంలో నిర్వహించిన సోదాల్లో ల్యాప్టాప్, కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లు, నకిలీ దరఖాస్తులు, ఐడీ ప్రూఫ్లు, అలాగే సుమారు రూ.21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా లేదా ప్రాసెసింగ్ పేరుతో నగదు వసూలు చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..