
సంక్రాంతి రష్తో…హైదరాబాద్-విజయవాడ హైవే వాహనాలతో కిటకిటలాడుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర హెవీ రష్ నెలకొంది. అయితే.. సంక్రాంతి పండుగ వేళ.. ఊర్లకు వెళుతున్న వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి అంటూ సూచించారు. ‘‘సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.’’ అంటూ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.
మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు.
తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి.
పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి.
ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించండి.
ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు.
గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ!.. అంటూ సీపీ సూచించారు.
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!
సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో… pic.twitter.com/esYAMfcz8O
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 9, 2026
సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి పల్లె బాట పట్టింది పట్నం. సంక్రాంతి యాతర.. వాహనాల జాతర షురూ అయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వేలాది వాహనాలు తరలి వెళుతున్నాయి. సంక్రాంతి సంబరాల కోసం జంటనగరవాసులు…ఊళ్లకు బయలుదేరారు. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో ఎనిమిది టోల్ బూత్లను, టోల్ ప్లాజా నిర్వాహకులు ఓపెన్ చేశారు. అయినప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు.. బ్లాక్ స్పాట్ల దగ్గర రోడ్డు పనులు కూడా జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు బంపర్ టు బంపర్ అనుకుని ప్రయాణిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి వైపు వెళ్తాయి. అక్కడే కొన్ని గుంటూరు వైపు మళ్లుతాయి. ఇక కొర్లపహాడ్ టోల్గేట్ దాటాక మరి కొన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మిగతావి విజయవాడ వైపు వెళ్తాయి. ఇలా మూడువైపులా వెళ్లేవి నార్కట్పల్లి వరకు రావాల్సిందే. అందుకే చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల బ్లాక్ స్పాట్స్ దగ్గర వాహనాల రద్దీ అధికంగా నెలకొంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..