
సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం రథోత్సవం. రామనామస్మరణల మధ్య సాకేత రామయ్య రథోత్సవం ఇవాళ కనులపండువగా సాగింది. రథాన్ని వాహనంగా చేసుకుని వేంచేసిన సాకేతరాముడ్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తర్వాత భగవంతుడికి పవిత్ర మంత్రోచ్ఛారణలతో పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. సమతా కుంభ్ 2026, రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం సనాతనం. ప్రతీ దృశ్యం సమ్మోహనం. రథోత్సవం మరింత మనోహరం.
ఉదయం ఆరాధన, అష్టాక్షరీ మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లో చివరి ప్రధాన ఘట్టమైన రథోత్సవం వైభవంగా సాగింది. ఈ రథోత్సవ వేడుకలో.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కుటుంబసభ్యులతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అష్టాక్షరి మంత్రం, రామనామస్మరణల మధ్య సాకేత రామయ్య.. రథోత్సవం కనులపండువగా సాగింది. ఇలాంటి రథోత్సవాన్ని దర్శించడం అంటే జన్మధన్యమే అంటారు. యాగశాల నుంచి సమతామూర్తి 108 దివ్యదేశాల మీదుగా విరజా సరస్సు వరకు రథోత్సవం కొనసాగింది.
రథము యాగశాలకు చేరుకున్నాక పూర్ణాహుతి జరిగింది. ప్రణవ రథంపై సాకేత రామయ్యను దర్శించిన భక్తుల ఆనందం ఆకాశమే హద్దుగా మారింది.
భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిపారు. తర్వాత గోవింద నామాలతో, సంకీర్తనలతో, భాజా భజంత్రీలతో, కోలాట నృత్యములతో భక్తులు వెంటరాగా త్రిదండి చినజీయర్ స్వామివారు రథయాత్రను ప్రారంభించారు.
భగవంతుడు రథమునే తన వాహనంగా చేసుకుని రథంలోకి వేంచేస్తాడు. రథంలో వేంచేసిన ఆ భగవంతుడిని దర్శిస్తే పవిత్రులవుతారు. ఆ తత్త్వాన్ని భావిస్తూ రథారూఢుడైన భగవంతుడిని దర్శిస్తే కర్మబంధముల నుండి విముక్తులవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవ దేహం ఒక రథం వంటిదని, ఆ రథంలో దేవదేవుడు నివసిస్తున్నాడని చాటిచెప్పే మహోత్సవమే రథోత్సవం అన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు రథచక్రాల్లాంటివని, వాటిని సమతతో నడిపించేదే జీవన ప్రయాణమన్న సందేశాన్ని ఈ ఉత్సవం ఇస్తుందన్నారు.
బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం అద్బుత దృశ్యం. సమతా మూర్తి కేంద్రం పుష్కరణిలో సాకేత రామచంద్ర ప్రభువుకు చక్రస్నానం నిర్వహించారు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. పెరుగు, తేనె, పండ్ల రసాలతో స్వామివారిని అభిషేకించారు.
రథారూఢుడైన భగవంతుడు చక్రస్నానం కోసం విరజాపుష్కరిణికి చేరుకున్నారు. పెరుమాళ్లను మండపంపై వేంచేపు చేసి స్వామికి తిరుమంజన సేవతో అభిషేకం నిర్వహించారు.
శ్రీరంగనాథుడు, శ్రీవైకుంఠనాథుడు, శ్రీరామచంద్రప్రభువు, సుదర్శన భగవానుని పుష్కరణిలో స్నానమాడి, ఆ జలాలను పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా, సుదర్శన భగవానుని మన అర్చక స్వాములు పవిత్ర మంత్రోచ్చారణలతో పుష్కరణిలో స్నానం ఆడించారు.
భగవంతుడికి విరజా పుష్కరిణి జలాలతో అభిషేకం జరిగింది. తర్వాత త్రిదండ్రి చినజీయర్ స్వామితో పాటు మిగతా వారు స్నానం ఆచరించారు.