Hyderabad Rains: హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జిల్లాలలో కూడా.. రానున్న గంటల్లో భారీ వర్ష సూచన

|

Jul 15, 2021 | 9:24 AM

హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 8 గంటలపాటు హైదరాబాద్‌, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు...

Hyderabad Rains: హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జిల్లాలలో కూడా.. రానున్న గంటల్లో భారీ వర్ష సూచన
Hyderabad Rains
Follow us on

హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 8 గంటలపాటు హైదరాబాద్‌, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

భాగ్యనగరాన్ని ముంచెత్తింది కుండపోత వాన. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షం..లోతట్టు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చాలాచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతమని లేదు. నగరవ్యాప్తంగా వాన దంచికొట్టింది.మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షాలకు మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలోని పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది. అటు లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రామంతపూర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. అటు పాత బస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.  ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

హైదరాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌, అబ్దుల్లాపూర్‌పెట్‌లో అత్యధికంగా 20 సెంటిమీటర్లు.. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో 19, పెద్ద అంబర్‌పేటలో 18, సరూర్‌నగర్‌, రామంతపూర్‌లో 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. హబ్సీగూడలో 16, నాగోల్‌లో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్‌.

Also Read: అంగన్వాడీ బియ్యం కల్తీ..! నానబెట్టిన కొద్దిసేపటికే… పైకి తేలిన రైస్

ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం