
ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం కొత్త సదుపాయాన్న ప్రారంభించింది. అన్రిజర్వుడ్ టికెట్లు పొందేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి మీరు అన్రిజర్వుడ్ టికెట్లు తీసుకోవాలంటే రైల్వే స్టేషన్లలోని టికెట్ల కౌంటర్ వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ల కౌంటర్ వద్ద అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టికెట్ వెండింగ్ మిషన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ డివిజన్లో మొట్టమొదటిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో వీటిని ఏర్పాటు చేయగా.. విడతలవారీగా అన్ని స్టేషన్లను విస్తరించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నిమిషాల కొద్ది కౌంటర్ల వద్ద వెయిట్ చేయడం తగ్గుతుంది. దీని వల్ల ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రస్తుతం కాచిగూడలో ఏర్పాటు చేయగా.. త్వరలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కూడా తీసుకురానున్నారు. ఈ మెషిన్ల ద్వారా అన్రిజర్వ్ డ్ రైల్వే టికెట్లతో పాటు ఫ్లాట్ ఫామ్ టికెట్లు, ఎంఎంటీఎస్ టికెట్లను కూడా పొందవచ్చు. ఇప్పటివరకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమందికి టెక్నాలజీపరంగా అనుభవం లేకపోవడం వల్ల వీటిని వాడుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన పోర్టబుల్ మెషిన్లు అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి ప్రయోజనం చేకూర్చనున్నాయి. టికెట్ల కౌంటర్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో టికెట్ల కోసం ప్రయాణికులు కొద్ది నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి రావడం వల్ల ట్రైన్లు మిస్ అవుతున్నారు. దీంతో కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించి ప్రయాణికులు సులువుగా రైల్వే టికెట్లను పొందేందుకు టెక్నాలజీతో కూడిన మెషీన్లను తీసుకొచ్చారు.
రైల్వే స్టేషన్ ఎంట్రీ గేట్ల వద్ద ఈ పోర్టబుల్ మెషిన్లను అందుబాటులో ఉంచుతారు. టీటీఈల వద్ద ఇవి ఉంటాయి. మీరు టీటీఈలను సంప్రదించి టికెట్లను పొందవచ్చు. ఈ యంత్రాల ద్వారా కేవలం సెకన్ల వ్యధిలోనే టికెట్ పొందవచ్చు. థర్మర్ ప్రింట్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. సెకన్కు 80 ఎంఎం వేగంతో టికెట్లను ఇది ప్రింట్ చేస్తోంది. టికెట్లను పొందేందుకు యూపీఐ లేదా క్యాష్ ద్వారా ప్రయాణికులు పేమెంట్ చేయవచ్చు. టీటీఈల వద్ద ఉంటే యూటీఎస్ యాప్ను పోర్టబుల్ ప్రింటర్కు లింక్ చేస్తారు. దీని ద్వారా టీటీఈలు టికెట్లను జారీ చేస్తారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రోజు 55 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. 120 రైళ్లు, 40 ఎంఎంటీఎస్ ట్రైన్లు సర్వీసులు అందిస్తున్నాయి.