Telangana: వాళ్లిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్

పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తుది తీర్పు వెల్లడించారు. వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఇద్దరిని BRS ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు..

Telangana: వాళ్లిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్టు ఆధారాలు లేవు: స్పీకర్‌ గడ్డం ప్రసాద్
Telangana Speaker Gaddam Prasad

Updated on: Jan 15, 2026 | 3:43 PM

పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తుది తీర్పు వెల్లడించారు. వాళ్లిద్దరూ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టంచేశారు. ఇద్దరిని BRS (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు.. ఈ మేరకు ఇద్దరి మీద బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేశారు.

ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్‌ ప్రసాద్ వెల్లడించారు. తాజాగా మరో ఇద్దరికి ఊరట కలిగింది..

ముందుగా ఐదుగురు.. తర్వాత ఇద్దరు.. మొత్తం.. ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌ ముందు వాదన వినిపించారు. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని.. ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేల వివరణపై స్పీకర్ సంతృప్తి చెంది.. బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించారు.

ఇవి కూడా చదవండి

ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కేసు పెండింగ్‌లో ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను సమయం కోరారు. ఈ ముగ్గురి విషయంలో కూడా గడ్డం ప్రసాద్‌ త్వరలో తీర్పు చెప్పనున్నారు.

అయితే.. మరో ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..