
రాఖీ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మేరకు TGSRTC 4,650 ప్రత్యేక బస్సులను నడిపించింది. ఈ నెల 7న 407, 8న 960, రాఖీ పండుగ(9న) నాడు 1,570, 10న 781, 11న 932 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 9500 పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. అందులో కొన్నింటినే స్పెషల్ సర్వీసులుగా రద్దీ రూట్లలో నడపడం జరిగింది.
ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను 50 శాతం వరకు సవరించుకునే వెసులుబాటును సంస్థకు కల్పించింది.
స్పెషల్ బస్సులకు చార్జీల సవరణ అనవాయితీగా జరిగేదే. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో చార్జీల సవరణ అనేది జీవో ప్రకారం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. పండుగ రద్దీ రోజుల్లో స్పెషల్ బస్సులు మినహా.. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే అమల్లో ఉంటాయి. ఇది సంస్థలో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రక్రియ. అదేం తెలియకుండా కొందరు పండుగ పేరుతో అన్ని సర్వీసుల్లో చార్జీలను పెంచినట్లు ఉద్దేశపూర్వకంగా సంస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ పేర్కొంది.
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ.. ప్రతి రోజు లక్షలాది మందిని టీజీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సిబ్బంది నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లే లక్షలాది మంది నమ్మకాన్ని సంస్థ చూరగొంది. అలాంటి సంస్థపై కావాలని తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం తగదని.. టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేస్తోన్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది.. వాస్తవాలు తెలుసుకోకుండా.. అబద్దపు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.