నార్సింగి, జూన్ 9: కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. అంతలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో ఆదివారం (జూన్ 9) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్ పరిధిలోని నార్సింగికి చెందిన శశివర్దన్ రెడ్డి అనే వ్యాపారవేత్తను గుర్తు తెలియని గ్యాంగ్ శనివారం అర్ధరాత్రి సమయంలో కారులో బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శశివర్దన్ కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సినీ ఫక్కీలో కిడ్నాపర్ల కారును చేజ్ చేశారు. కర్నూలు వైపు వెళ్తుండగా మహబూబ్నగర్ జిల్లాలో కిడ్నాపర్లను అడ్డగించారు. కారును నిలువరించిన నార్సింగ్ పోలీసులు కిడ్నిపర్లను పట్టుకున్నారు. రాయలసీమకు చెందిన గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు సమయానికి స్పందించడంతో శశివర్దన్ను క్షేమంగా రక్షించగలిగారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్కు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.