
శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మఠం సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, చారిత్రిక దేవాలయాలను సంరక్షించేందుకు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇందులో భాగం కావాలని ప్రజలందరినీ ఆహ్వానిస్తోంది. దేవాలయాలను పునరుద్ధరించడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ‘కాలడి శంకర మదోమ్ – దేవస్వోం’ పేరిట ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబర్ 29న ఉదయం 11.10 గంటలకు దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనికి అందరూ రావాలని మఠం పీఠాధిపతులు కోరారు. అందరూ కూడా ఈ ఆదివారం ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. హైదరాబాద్లోని తరమతిపేట్లో ఉన్న శ్రీ అయ్యప్ప దేవాలయం దీనికి వేదిక కానుంది.