
ట్రైనీ IPS ఉదయ్కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఉదయ్కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.. ట్రైనీ IPS ఉదయ్కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్కృష్ణ నిన్న మిర్యాలగూడలో అరెస్ట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడనుంచి సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ ఆఫీస్కు తరలించారు.. ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఇదిలాఉంటే.. ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. నేషనల్ పోలీస్ అకాడమీలో పూర్తిగా పరస్పర అంగీకారంతోనే ఈ ఘటన జరిగిందని ఉదయ్కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇద్దరూ ఇష్టంతోనే ఇన్నాళ్లు బాగానే ఉన్నారని, కానీ.. భర్త ఒత్తిడితోనే బాధితురాలు కేసు పెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్రైనీ ఐపీఎస్లే సాక్షులుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే NPA అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు. పోలీసులు కూడా అన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున ఉదయ్ను ప్రశ్నించడానికి ఏమీ లేదని చెప్పారు. ట్రైనింగ్ పూర్తవుతున్న తరుణంలో ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్ను రిజెక్ట్ చేయాలని కోరగా, ఈ క్వాష్ పిటిషన్పై విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.
ఇక.. జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు.. వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులకు కనిపించకుండా వెళ్లిపోయారు. సెల్ఫోన్ కూడా స్విచ్చాఫ్ కావడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈ క్రమంలోనే.. ఉదయ్కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..