
హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న సక్సెస్ ది స్కూ్ల్లో విద్యార్థులకు ఇస్లామిక్ మతపరమైన పాఠాలను ప్రార్థనలను తప్పనిసరి హోంవర్క్గా ఇస్తున్నారన్న అంశం NHRC దృష్టికి చేరింది. ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తూ తమకు వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది. ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని NHRC ధర్మాసనం, మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 లోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
అసలు ఏం జరిగింది?
రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థి స్కూల్ డైరీలో ‘కల్మా’, ‘సూరా ఫాతిహా’ వంటి మతపరమైన పాఠాలను చదవాలని, హోంవర్క్ పూర్తి చేయాలని ఉపాధ్యాయురాలు రాశారు. ఇది గమనించిన విద్యార్థి కుటుంబ సభ్యులు, లౌకిక విద్యాసంస్థలో మత బోధనను బలవంతంగా రుద్దడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో వివాదం ముదిరింది.ఈ వివాదంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం, ఇది ఉపాధ్యాయురాలి పొరపాటు వల్ల జరిగిందని, దీనియత్ సబ్జెక్టు కేవలం ముస్లిం విద్యార్థుల కోసం మాత్రమేనని తెలిపింది. దీనికి బాధ్యురాలైన ఉపాధ్యాయురాలు షేక్ ఆయిషా పర్వీన్ను యాజమాన్యం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనపై బీజేపీ నేతలు, విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లౌకిక విద్యాసంస్థల్లో ఇటువంటి పద్ధతులు ఉండకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.