
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ విభేదాల నేపథ్యంలో సల్మాన్ (25) అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్పై అమానుషంగా దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడి తలను పిల్లర్కు బలంగా కొట్టి, అనంతరం పైకి ఎత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు.. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని బాలుడిని రక్షించించారు. అనంతరం నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
ఇక తీవ్రంగా గాయపడిన చిన్నారి అర్మాన్ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడు సల్మాన్ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఘటన జరిగిన వెంటనే స్థానికులు డయల్-100కు 7:29 గంటలకు సమాచారం ఇవ్వగా పోలీసులు మాత్రం గంట ఆలస్యంగా సుమారు 8:35 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్కు రెండు కిలోమీటర్ల లోపే సంఘటనా స్థలం ఉన్నప్పటికీ గంటకు పైగా ఆలస్యంగా రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.