
నగరంలో సంచలనం సృష్టించిన పాతబస్తీ యువకుడి మిస్సింగ్ కేసు చివరకు విషాదాంతమైంది. మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదైన ‘అవేస్ ఖాన్’ అనే యువకుడు, కొద్ది రోజులకే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సర్దార్ నగర్ గేట్ సమీపంలో లభించిన అతని మృతదేహం చుట్టూ ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవేస్ ఖాన్ మృతదేహం లభ్యమైన తీరుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు అవేస్ ఖాన్ను సర్దార్ నగర్ గేట్ వద్దనే హత్య చేశారా? లేక మరెక్కడైనా హత్య చేసి, ఆధారాలు చెరిపేసేందుకు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించారు.
సీసీటీవీలు, కాల్ డేటాపైనే ఫోకస్
అవేస్ ఖాన్ చివరిసారిగా ఎవరితో కనిపించాడు? ఎవరితో మాట్లాడాడు? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు సాంకేతిక ఆధారాలపై ఆధారపడుతున్నారు. మృతుడి ఫోన్ కాల్ డేటా (CDR), మొబైల్ లొకేషన్ వివరాలను విశ్లేషిస్తున్నారు. అవేస్ ఖాన్ చివరిసారిగా తిరిగిన ప్రాంతాలతో పాటు, మృతదేహం లభించిన పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఫుటేజీల ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికే కీలకం
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటి? మరణానికి గల ఖచ్చితమైన కారణాలు, అలాగే ఏ సమయంలో హత్య జరిగింది? వంటి విషయాలు పోస్టుమార్టం నివేదిక వస్తేనే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
పాత కక్షలా? ఆర్థిక వివాదాలా?
ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు, స్నేహితుల మధ్య గొడవలు, లేదా ఆర్థిక లావాదేవీల వల్ల ఈ హత్య జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే అవేస్ ఖాన్ కుటుంబ సభ్యులను, స్నేహితులను మరియు అతని సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.