Hyderabad Kidney Racket Bust: కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు

కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి ముసుగులో ఓ భారీ కిడ్నీ దందాకు ఆముఠా తెరలేపినట్లు స్పష్టమవుతోంది. దొరికింది కొందరే. కానీ దొరకాల్సింది చాలా ఉందని పోలీసుల మాటల్లో అర్థమవుతోంది.

Hyderabad Kidney Racket Bust: కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు
Kidney Racket Bust

Edited By:

Updated on: Jan 27, 2025 | 1:04 PM

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్‌లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టు తేల్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ లేకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్ ఇద్దరూ కలిసి భారీగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేశారు.

మొదట డా. అవినాష్ సైదాబాద్‌లో జననీ హాస్పిటల్‌ను స్థాపించాడు. అందులో ఆయనకి ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో 2022లో హాస్పిటల్ మూసేశాడు. తర్వాత డాక్టర్ సుమంత్ పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సరూర్‌నగర్‌లో అలకనంద హాస్పిటల్ స్థాపించారు. ఈ హాస్పిటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేవారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు 20కి పైగా కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్ల నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి సర్జరీ నిర్వహించే డాక్టర్లను అలకనంద హాస్పిటల్‌కు రప్పించారు.. సర్జరీ చేసే వైద్యుల్లో కీలకంగా తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్‌తో పాటు జమ్ము కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ సాహెబ్ ఉన్నారు .

కిడ్నీలను డొనేట్ చేసేందుకు ఎక్కువగా పేద కుటుంబానికి చెందిన వారే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ అమ్మితే లక్షల రూపాయలు వస్తాయని ఆశపడి ఎలాంటి నిబంధనలు లేకున్నా సరే ఈ తరహాలో ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్‌కు దళారులు 60 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీటిలో కిడ్నీ డొనేట్ చేస్తున్న వ్యక్తికి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కిడ్నీ ఆపరేషన్ చేసిన వైద్యుడికి ఒక్కో డాక్టర్‌కు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లకి ఒక్కో ఆపరేషన్‌కు 30 వేల రూపాయలు ఇస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో 9 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 15 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో మరో ఆరుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మెయిన్ సర్జరీ చేసిన ఇతర డాక్టర్ల కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. వీరీని పట్టుకునేందుకు చెన్నైతోపాటు జమ్ము కాశ్మీర్ కు ఎస్ఓటి బృందాలు వెళ్లినట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us