
హైదరాబాద్: నగరంలో మీరు మేక మాంసం కొనుగోలు చేస్తున్నామనుకుంటున్నారు.. కానీ నిజంగా మీ ఇంటికి చేరేది అదేనా? H-FAST, పోలీసులు మల్లేపల్లిలో నిర్వహించిన తాజా దాడులు ఇప్పుడు ఇదే ప్రశ్నను తెరపైకి తెచ్చాయి. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మీట్ షాప్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించడం సంచలనంగా మారింది.
కొందరికి అనుమానం రావడంతో ఫిర్యాదు చేశారు.. దీంతో దర్యాప్తు మొదలైంది. మల్లేపల్లి బడి మసీదు సమీపంలోని ఉస్మాన్ మీట్ షాప్పై అనుమానాల నేపథ్యంలో H-FAST అధికారులు, హబీబ్నగర్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో విక్రయానికి ఉంచిన మాంసాన్ని పరిశీలించిన అధికారులు, అది స్వచ్ఛమైన మేక మాంసం కాదని ప్రాథమికంగా గుర్తించారు.
తనిఖీల్లో సుమారు 50 కిలోల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, వెంటనే నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఇప్పుడు అందరి దృష్టి ల్యాబ్ నివేదికపైనే ఉంది.
ఈ ఘటనకు సంబంధించి మీట్ షాప్ యజమాని ఉస్మాన్ ఖురేషిపై హబీబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ల్యాబ్ నివేదికలో కల్తీ నిర్ధారణ అయితే నిందితుడిపై మరిన్ని కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ ఆహార మాఫియాపై దాడులు కొనసాగుతాయని H-FAST అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..