AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Messi Tour: హైదరాబాద్‌కి మెస్సీ మ్యానియా.. ఫోటో దిగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

మెస్సీ మెరిసి...ఫ్యాన్స్‌ మురిసి! యస్‌. ఇవాళే ఫుట్‌ బాల్‌ సూపర్‌స్టార్‌, వరల్డ్‌ కప్‌ విజేత లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌లో అడుగు పెడుతున్నారు. కాలు కాలు కదిపి ఆయనతో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ ఆడడానికి సీఎం రేవంత్‌ సై అంటున్నారు. ఇటు మెస్సీ మెస్మరైజింగ్‌ ఫుట్‌బాల్‌ గేమ్‌కు తెర లేస్తుంటే...అటు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పొలిటికల్‌ ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ షురూ అయింది. ఇక మెస్సీ ఫీవర్‌తో హైదరాబాద్‌ ఊగిపోతోంది.

Messi Tour: హైదరాబాద్‌కి మెస్సీ మ్యానియా.. ఫోటో దిగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Messi Goat Tour
Ravi Kiran
|

Updated on: Dec 13, 2025 | 7:39 AM

Share

మెస్సీ ఫీవర్‌తో హైదరాబాద్‌ ఊగిపోతోంది. హైదరాబాద్‌లో మెస్సీ మెరిసి…అభిమానులు మురిసిపోయే క్షణాలు వచ్చేశాయి. సాకర్‌ సూపర్‌ స్టార్‌ మెస్సీ…ఇవాళ సాయంత్రం 4 గంటలకు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వస్తారు. అక్కడ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుని, వందమంది ఫ్యాన్స్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌ పేరుతో ఫొటో సెషన్‌ పూర్తిచేస్తారు. మెస్సీతో ఫొటో దిగాలంటే ఒక్కొక్కళ్లు పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఆ తర్వాత సాయంత్రం ఆరున్నరకు ఉప్పల్‌ స్టేడియంకు వెళతారు.

మెస్సీ.. సాయంత్రం 7గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌ బాల్‌ క్లినిక్‌లో పాల్గొని, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి 20నిమిషాల పాటు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడతారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం. సీఎం రేవంత్‌ ప్లేయర్‌ హోదాలోనే మ్యాచ్‌కు హాజరవుతున్నారు. మెస్సీ, రేవంత్‌ టీమ్స్‌ మధ్య ఈ మ్యాచ్‌ జరగబోతోంది. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేస్తారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు. ఇక ఈ మ్యాచ్‌ కోసం ఫుల్‌ ప్రాక్టీస్‌లో ఉన్నారు రేవంత్‌ రెడ్డి. మరోవైపు ఉప్పల్‌ స్టేడియం దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అయితే మెస్సీ రాక కాక పుట్టిస్తోంది. వినోదాల ఆట…వివాదాల వేటగా మారింది. అటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ షురూ కాక ముందే…ఇటు కాంగ్రెస్‌, బీజేపీ టీమ్స్‌ మధ్య పొలిటికల్‌ ఫుట్‌ బాల్‌ గేమ్‌ షురూ అయింది. మెస్సీతో కొన్ని నిమిషాలు ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది బీజేపీ. దీనికోసం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు అందోళనకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే బీజేపీ కావాలనే మెస్సీ రాకను వివాదం చేస్తోందని కౌంటర్‌ ఇచ్చారు మెస్సీ టూర్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌ పార్వతీరెడ్డి. సింగరేణి కాలరీస్‌ స్పాన్సర్‌ చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. క్రీడల అభివృద్ధికి ఎవరైనా ముందుకు రావొచ్చన్నారు. మెస్సీ రాకతో భారత్‌లో ఫుట్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. మెస్సీ క్రేజ్‌తో హైదరాబాదీ ఫ్యాన్స్‌లో పూనకాలు లోడ్‌ అవుతున్నాయి.

Follow Us