మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ శుక్రవారం నుంచి వార్తలు తెగ సర్కులేట్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఎప్పటిలాగానే ఉదయం 6గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. అయితే, ప్రయాణీకుల సౌలభ్యం కోసం ట్రయల్ ప్రాతిపదికన.. అన్ని శుక్రవారాలు, సోమవారాల్లో మాత్రమే పొడిగించిన సర్వీస్ను అందిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారాల్లో చివరి రైలు 11:00 PMకి బదులుగా 11:45 PMకి బయలుదేరుతుందని, అదనంగా 45 నిమిషాల సేవను అందిస్తుందని చెప్పారు. సోమవారాల్లో, మొదటి రైలు 6:00 AMకి బదులుగా 5:30 AMకి బయలుదేరుతుందని, అదనంగా 30 నిమిషాల సేవను అందిస్తుందని వెల్లడించారు.
ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే సర్వీసుల అందుబాటులో ఉంచేందుకు ఇది ఒక పరిశీలన మాత్రమే అని స్పష్టం చేశారు. ఇంకా ఆ వేళలపై ఎలాంటి ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్నారు. పాసింజర్స్ రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయం విషయంలో గందరగోళానికి గురికావొద్దని, యథావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..